వరదల్లో ఇల్లుపోతే ఇల్లు.. బైక్‌ పోతే బైక్‌.. కారుపోతే కారు ఇస్తాం : బండి సంజయ్‌

వరదల్లో ఇల్లుపోతే ఇల్లు.. బైక్‌ పోతే బైక్‌.. కారుపోతే కారు ఇస్తాం : బండి సంజయ్‌
X

తెలంగాణ ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం కేసీఆరేనన్నారు మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈసారి కూడా మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దేనని.. ఓల్డ్‌ సిటీలో కూడా 10 సీట్లను టీఆర్ఎ‌స్ కైవసం చేసుకుంటుందన్నారు. ఎంఐఎంకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే సపోర్టు ఇస్తుందన్నారు. మతంపేరుతో వివాదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. హైదరాబాద్‌కు వరద సాయం కింద కేంద్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్న కేటీఆర్.. బీజేపీ గెలిస్తే... గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. గోల్కండపై సీఎం కేసీఆర్‌ జెండా ఎగురవేశారని.. గోల్కండపై కాషాయాలు, కషాయాలు ఉండవంటూ వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. CMకు ఎంఐఎంతో సంబంధాలుంటే ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లేనంటూ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. బీజేపీని మేయర్‌గా గెలిపిస్తే వరద బాధితులకు ఇంటికి 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో ఇల్లుపోతే ఇల్లు, బైక్‌ పోతే బైక్‌... కారుపోతే కారు ఇస్తామన్నారు.

కేసీఆర్‌, బండి సంజయ్‌ కలిసి తెలంగాణ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇద్దరు కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మార్చుకున్నారని అన్నారు. ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్ ఒకే ఎజెండాతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఎంఐఎం సహకారం అందిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎంది తెరముందు కుస్తీ, తెర వెనుక దోస్తీ అని మండిపడ్డారు.

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో నేతలు మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఘాటైన విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలతో ఎన్నికల వేడిని అమాంతం పెంచేశారు.

Tags

Next Story