POLITICS:గులాబీ తోటలో కమల వికాసం?

లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమంగా సీట్లు గెలుచుకుని బీజేపీ హుషారుమీదుండగా.. కనీసం బోణీ కూడా చేయలేక చతికిలపడ్డ బీఆర్ఎస్ ఉనికి కోసం తండ్లాడుతోంది. ఒక వైపు ఎమ్మెల్యేల వలసలు.. మరో వైపు కేసుల ఉచ్చులతో బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఊపిరిసలపని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోయే ఎమ్మెల్యేలు పోయినా.. క్యాడర్ను నిలబెట్టుకుని పార్టీని కాపాడుకోవచ్చునుకున్న ఆ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం వరుస దర్యాప్తులతో బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు పార్టీని, ఉనికి కాపాడుకునేది ఎలా? అధినాయకులూ ప్రజల్లో నిలబడేదెలా? మరో వైపు రాష్ట్రంలో టీడీపీ కూడా బలపడాలని ఉబలాటపడుతోంది. వీటన్నింటినీ తట్టుకునేది ముందుకు సాగేదెలా అనే ప్రశ్నలు బీఆర్ఎస్ హైకమాండ్ను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. అందుకే పొత్తు మార్గాలను బీఆర్ఎస్ అన్వేషిస్తోందన్న వార్తలు వార్తలు వస్తున్నాయి.
కవిత చుట్టూనే...
తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు కవిత చుట్టూనే తిరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తానే అడ్డుకున్నానంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేసేందుకు యత్నించారన్న నిజాన్ని సాక్ష్యాత్తూ కేసీఆర్ తనయే బహిరంగ పర్చడం.. ఇప్పుడు సంచలనంగా మారింది. కవిత వ్యాఖ్యలు... కేసీఆర్ శైలి.. బీఆర్ఎస్ అధినాయకత్వం వేస్తున్న అడుగులు చూస్తుంటే గులాబీ తోటలో కమల వికాసం ఖాయమనే చర్చ జరుగుతోంది.
ఉద్యమ పార్టీ ఇలానా..
టీఆర్ఎస్... ప్రత్యేక తెలంగాణే లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనూ పార్టీ పేరు మారలేదు. అయితే రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్.. కాస్త బీఆర్ఎస్గా మారింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చినా.. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వైపు అడుగులు వేసినా గులాబీ పార్టీని మాత్రం విలీన ప్రచారాలు వీడడం లేదు. కవిత లేఖ, లీకులతో ఓ సంచలన విషయం బహిర్గతమైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. ఆ సమయంలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్రలు జరిగాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు గులాబీ పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీన అంశంపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. **ఇలాంటి జటిల పరిస్థితుల్లో కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కలిసి పొత్తు అవకాశాలపై సంప్రదింపులు జరిపినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
ఆరంభం నుంచే విలీన ప్రచారం
పార్టీ స్థాపించినప్పటి నుంచి గులాబీ పార్టీని "విలీనం" ప్రచారం మాత్రం వెంటాడుతోంది.‘ప్రత్యేక రాష్ట్రసాధనే తన లక్ష్యమని.. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ ను ఆ పార్టీలో లో విలీనం చేస్తానని స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. అయితే 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ఇక కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమవుతుందంటూ ప్రచారం జరిగింది. అయితే పదవులు, ప్రాధాన్యతలు, ఇతర అంశాల్లో తేడా రావడంతో చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. దీంతో ‘గులాబీ’ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
మళ్లీ అదే ప్రచారం
గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ విలీనం అనే మాటే వినపడలేదు సరికదా కేసీఆర్ ఏకంగా జాతీయ పార్టీ వైపుగా అడుగులు వేశారు. దీంతో అంతా బాగానే ఉందని గులాబీ శ్రేణులు కూడా భావించాయి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రతిపాదనలు వచ్చాయని జోరుగా ప్రచారం సాగింది. కొందరు పార్టీ నేతలు ఈ విషయాన్ని అంతర్గతంగా అంగీకరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కవితే.. పార్టీని బీజేపీకి అప్పగించే కుట్ర జరిగిందని... దానిని నేను పూర్తిగా వ్యతిరేకించానని చెప్పడంతో ఒక్క సారిగా పార్టీ కేడర్, నాయకులు షాక్ అయిపోయారు. గతంలోనే ఒక సారి కాంగ్రెస్లో విలీనం అని చివరికి బయటపడ్డామని, ఇప్పుడు మళ్లీ బీజేపీలో విలీనమా? అని ఆ పార్టీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
చరిత్రను గమనిస్తే..
చరిత్రను గమనిస్తే... గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్... కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కమలం పార్టీతో బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం చేసుకుందన్న విమర్శలయితే ఉన్నాయి . ఈ ఒప్పందం వల్లే లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ సీరియస్ ఫైట్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com