TS: ప్రజాపాలన దరఖాస్తుల కార్యాచరణకు మంత్రివర్గ ఉప సంఘం

TS: ప్రజాపాలన దరఖాస్తుల కార్యాచరణకు మంత్రివర్గ ఉప సంఘం
X
అర్హులను ఎంపిక చేయనున్న కమిటీ... సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం

తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణ , విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది . ఈ కమిటీ అర్హులను ఎంపిక చేసి అభయాస్తం పథకాలను అందించనుంది. ఈ నెలాఖరు కల్లా డేటా ఎంట్రీ పూర్తి చేసి అర్హులైన వారందరికీ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను అమాత్యులు తిప్పికొట్టారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన తదుపరి కార్యాచరణపై సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఉపముఖ్యమంత్రి, మంత్రులు, CS, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రజాపాలన కార్యక్రమంపై సమగ్రంగా చర్చించారు.


ఈ భేటీలో అభయాస్తం పథకాలకు వెల్లువలా వచ్చిన కోటి 5 లక్షలు, ఇతర అవసరాల కోసం వచ్చిన 20 లక్షల దరఖాస్తులపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రజాపాలన విధివిధానాల కోసం ప్రభుత్వం... ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా వ్యవహరించనున్నారు . ఈ కమిటీ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఏ ఏ పథకానికి ఎవరెవరు అర్హులనేది తేల్చనుంది. ఈనెలాఖరు నాటికి ప్రజాపాలనలో వచ్చిన అర్జీలకు సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తిచేసిన వెంటనే పథకాల అమలు చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


నెలరోజులు పూర్తికాని ప్రజా ప్రభుత్వంపై విపక్ష నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ఏ వర్గానికీ న్యాయం చేయని భారాస నాయకులు గ్యారంటీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం మానకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. ఇప్పటికీ దరఖాస్తు చేయనివారుంటే రెవెన్యూ, మున్సిపల్‌, జోనల్‌ కార్యాలయాల్లో అభయ హస్తం అర్జీలు ఇవ్వొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణలో అయిదు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఏమినిది రోజులు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కోటి 20 లక్షలకుపైనే దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు...ఆందోళన చెందొద్దని... ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

Tags

Next Story