Panchayat Elections : పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం కండి .. ఎస్ఈసీ ఆదేశాలు

పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికారులు నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) పార్థసారథి ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు,ఈఆర్వోలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేయాలని తెలిపారు. సెప్టెంబరు 6 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాలు తయారు చేసి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరించాలన్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులన్నీ జాగ్రత్తగా సీఈసీ నిబంధనల మేరకు పూర్తి చేసి సెప్టెంబరు 21న తుది జాబితా ప్రచురించాలని పార్థసారథి ఆదేశించారు. ఓటరు జాబితా సిబ్బంది తర్వాత వార్డుల వారీగా పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలుంటాయని వివరించారు. ఎన్నికల అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్ ను పార్థసారథి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీ రాజ్ కార్యదర్శి లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

