కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పంట కొనుగోలు కేంద్రాల కొనసాగింపు, రైతులకు సంబంధించి ఇతర డిమాండ్లతో పాదయాత్రగా బయలుదేరారు.
అంతకుముందు రాజీవ్ రైతు దీక్షలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి అచ్చంపేట వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మల్లురవి, సీతక్క.. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా వెళ్లాలని రేవంత్ను కోరారు. దీంతో వారి ప్రతిపాదనపై స్పందించిన రేవంత్ రెడ్డి అక్కడిక్కడే పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారు.
అంతకు మందు రాజీవ్ రైతు భరోసా దీక్షలో మాట్లాడిన రేవంత్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, మద్దతు ధర లేదని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ రూ.15లక్షల కోట్లను కార్పొరేట్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు. రైతుల జీవితాలను అదానీ, అంబానీలకు అమ్మబోతున్నారని మండిపడ్డారు. రైతులు కష్టాలు ఇలా ఉంటే.. కారెక్కి ఇంటికి ఎట్లా వెళ్తానన్నారు రేవంత్ రెడ్డి.
ఇక తొలిరోజు అచ్చంపేట నుంచి ఉప్పునుంతల వరకు 11 కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉప్పునుంతలలోనే రాత్రి రేవంత్ విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి ఇవాళ ఉదయం హైదరాబాద్కి పాదయాత్రగా బయల్దేరనున్నారు. రేవంత్ పాదయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com