Ts: సర్పంచ్ ఎన్నికల వేళ గుడ్న్యూస్

సర్పంచ్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది. ఇక నుంచి ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడించారు.
స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఎప్పటినుంచో వస్తున్న డిమాండ్లకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే నిబంధన ఉండగా.. ఆ నిబంధనను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఇటీవల సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు.
2019లో తీసుకువచ్చిన మున్సిపల్ చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థులకు ఏ ఏ సందర్భాల్లో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి గరిష్ఠంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని.. అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు అవుతారని తీసుకువచ్చిన చట్టం 1994 మే 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తేదీకి ముందు ఎంత మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా అంటే 1995 మే 29వ తేదీ లోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా మినహాయింపును ఇచ్చారు. 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com