REVANTH: వ్యవస్థలను గాడిన పెడుతున్నాం

తెలంగాణను పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకున్నామని, రూ. 2700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బీసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కులగణన దేశానికే ఆదర్శం
కులగణన దేశానికే ఆదర్శమని రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా కులగణన జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్లో సదుపాయం కల్పించామని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ సమాజానికి మహిళలే పునాది అని, అదానీ, అంబానీలకు పోటీ పడేలా మహిళలతో స్వయం సహాయక సంఘాలు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. బస్సులకు మహిళలను యజమానులు చేస్తున్నామని, ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూలస్తంభాలు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారికి రూ.21వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. పాఠశాలల నిర్వహణ మహిళలకే అప్పగించాం. రుణాలిచ్చి బస్సులు కొనుగోలు చేయించాం. మహిళా సంఘాల బస్సులను ఆర్టీసీకి అద్దెకు తీసుకుని వాళ్లకి ఆదాయం కల్పిస్తున్నాం. క్యూఆర్ కోడ్ కార్డు ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తాం." అని రేవంత్ ప్రకటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న రేవంత్..ఏడాదిలోపే రూ.2లక్షలలోపు రుణాలను మాఫీ చేశామన్నారు.
సంస్కృతి ఉట్టిపడేలా మిస్ వరల్డ్ పోటీలు'
హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడిందని సీఎం రేవంత్ అన్నారు. చార్మినార్ నుంచి వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి వరకు ప్రపంచ సుందరీమణులు మొత్తం చుట్టేసి వచ్చారన్నారు. పిల్లలమర్రి నుంచి నిర్మల్ కొయ్య బొమ్మల తయారీ వరకు వారిని సంప్రదాయాల్లో భాగం చేశామని తెలిపారు.
'క్వింటాల్కు రూ.500 బోనస్'
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ అన్నారు. 'అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశాం. రైతుల ఖాతాల్లో రూ.26 వేల కోట్లు జమ చేశాం. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. దీనివల్ల సన్నవడ్ల సాగు గణనీయంగా పెరిగింది. రూ.2.75 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోంది' అని పేర్కొన్నారు.
'పాలన నల్లేరుపై నడక కాదని తెలుసు'
పాలన నల్లేరుపై నడక కాదని తనకి తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనులు చేపట్టామని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేశామని తెలిపారు.
'బీసీలకు 42% రిజర్వేషన్లు'
కులగణన ద్వారా రాష్ట్రంలో 50.3 శాతం బీసీలు ఉన్నారని తేలిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ తీరుస్తామని వెల్లడించారు. హైదరాబాద్ను మరింత తీర్చిదిద్దేందుకు జపాన్ సహకరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తున్నామని అన్నారు. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామమని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com