TS: ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వాళ్లు ఎక్కడ?

TS: ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వాళ్లు ఎక్కడ?
X
మహేశ్వరాన్ని న్యూయార్క్‌తో పోటీపడేలా సరికొత్త నగరంగా మారుస్తామన్న రేవంత్‌

ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్లు ఎక్కడ ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సర్కార్‌ను కూలుస్తామని అన్నందుకే ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం లాంటి వారు ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ వచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు కొనసాగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సైబరాబాద్‌ను నగరంగా అభివృద్ధిచేసినట్టే మహేశ్వరాన్ని తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ నిర్మాణంతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందన్నారు.


త్వరలోనే హయత్‌నగర్‌ వరకు మెట్రో రైలును విస్తరించనున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్‌లో మెట్రో ఎక్కితే నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడ గ్రామంలో గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ కవచం’ రక్షణ కిట్ల పంపిణీని సీఎం ప్రారంభించారు. కవచం ధరించి చెట్లెక్కిన గీత కార్మికులతో ఆయన నేరుగా మాట్లాడారు. గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. వారితో కలిసి భోజనం చేశారు.

పౌరుషానికి, పోరాటానికి గౌడన్నలు మారుపేరని రేవంత్‌ అన్నారు. కులవృత్తులకు చేయూత అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కులవృత్తులను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని... కుల, చేతివృత్తిదారులు తమ పిల్లలను వృత్తికే అంకితం చేయకుండా బాగా చదివించాలని రేవంత్‌ సూచించారు. గత ప్రభుత్వం గీత కార్మికులకు చెల్లించని రూ.7.90 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేస్తామన్నారు. తాటిచెట్ల పైనుంచి గీత కార్మికులు కిందపడి ప్రాణాలు కోల్పోకుండా.. వారి రక్షణ కోసం రూపుదిద్దుకున్న ‘కాటమయ్య రక్షణ కవచం’.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మాలోతు పూర్ణ ఆలోచన అని తెలిపారు. ఈ కవచాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లాలో ఎకరం రూ.100 కోట్లు పలికే భూములున్నాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డును 350 కిలోమీటర్ల మేర తెలంగాణకు వడ్డాణంలా నిర్మించడంతోపాటు రేడియల్‌ రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. 25 వేల ఎకరాల్లో కాలుష్యానికి అవకాశం లేని పరిశ్రమలతోపాటు మెడికల్‌ హబ్, విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

Tags

Next Story