నా భర్త చదివిన స్కూల్... ఓ ఫొటో తీయండి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి స్కూల్స్ రీఒపెన్ అయిన సంగతి తెలిసిందే. స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి, జిల్లెల గూడ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. అయితే ఇదే పాఠశాలలో తన భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి చదివిన విషయాన్నీ ఆమె గుర్తుచేసుకున్నారు. అప్పటికే ఆ పాఠశాలలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేయాలని మంత్రి విద్యాధికారులను ఆదేశించారు. అదే భవనంలో ఇంద్రారెడ్డి చదువుకున్నారని ఓ నాయకుడు మంత్రి సబితా దృష్టికి తేవడంతో ఆమె ఆ భవనం దగ్గరకు వెళ్లారు. నా భర్త చదివిన పాఠశాల ముందు ఒక ఫోటో తీయండి అని చెప్పారు. ఈ ఫోటో తన మనవలకు చూపించి వారి తాత చదివిన పాఠశాల అని వివరిస్తానని అన్నారు. కాగా ఇంద్రారెడ్డి టీడీపీ, కాంగ్రెస్ హయంలలో మంత్రిగా పనిచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com