SAD: అంత కష్టం ఏమొచ్చిందమ్మా...

ఏ తల్లి అయినా కన్నబిడ్డలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డలే ఒక తల్లికి ప్రాణసమానాలు. వారి నవ్వే ఆమె ప్రపంచం, వారి కన్నీళ్లు ఆమెకు గుండెల్లో మంట. అలాంటి తల్లే క్షణికావేశంలో తన సొంత పిల్లలకు మరణ శాసనం రాస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని బీబీనగర్ మండలం పరిధిలో ఉన్న గొల్లగూడెం గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్ రైల్వే శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆయనకు ఐశ్వర్య అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు రెండేళ్ల పాప, పదినెలల బాబు ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ వివాదాల నేపథ్యంలో ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులు, పెద్దమనుషులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి మళ్లీ అత్తారింటికి పంపించారు. కానీ అదే రోజు రాత్రి ఊహించని విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారులను దిండుతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారుల అమాయక ముఖాలు, వారి భవిష్యత్తు ఒక్క క్షణంలో చీకటిలో కలిసిపోవడం స్థానికులను కలచివేసింది. తల్లికి ఎలాంటి మానసిక ఒత్తిడి, కష్టం ఎదురైందో తెలియదు కానీ పిల్లలను హతమార్చడం అందరినీ షాక్కు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే కారణమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తల్లి చేతుల్లోనే ముగిసిన రెండు చిన్నారుల ప్రాణాలు సమాజాన్ని మరోసారి ప్రశ్నిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
