TS: ఏబీబీ చేతికి గొర్రెల పంపిణీలో గోల్‌మాల్‌ కేసు

TS: ఏబీబీ చేతికి గొర్రెల పంపిణీలో గోల్‌మాల్‌ కేసు
అవినీతి నిరోధక శాఖకు కేసు బదిలీ చేసిన పోలీసులు.... రెండు కోట్ల నిధులు స్వాహా!

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవకతవకల కేసు ACB చేతికి వెళ్లింది. ఈ కేసు విచారణ జరపాలని అవినీతి నిరోధక శాఖకు పోలీసులు బదిలీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో OSD కల్యాణ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు అయింది. ఈ కేసును విచారించాలని పోలీసులు ACBకి బదిలీ చేశారు. పశుసంవర్దక శాఖలో గొర్రెల పంపిణీ గోల్‌మాల్‌ కేసును అవినీతి నిరోధక శాఖకు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం పేరిట రైతులను మోసం చేశారని భాదితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాద్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రెపిల్లలు సేకరించి ఉచితంగా పంపిణీ చేస్తోంది.


"లోలోనా- ది లైవ్‌స్టాక్ కంపెనీ" నిర్వహిస్తున్న సయ్యద్ మోయీద్ అనే గుత్తేదారుతో కలిసి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్... గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతుల వద్ద గొర్రె పిల్లలు పరిశీలించారు. 20 గొర్రెలు, 1 పొట్టేలు కలిపి ఒక యూనిట్‌గా మొత్తం 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు. అనంతరం రైతుల ఆధార్‌, పాన్‌ కార్డుతోపాటు బ్యాంక్ అకౌంట్ నంబర్లను పశుసంవర్ధకశాఖ అధికారులు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి నేరుగా రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా.. అధికారులు చేయాల్సిన పని కాంట్రాక్టర్ సయ్యద్ మోయీద్‌కు అప్పగించారు.

దీంతో అతను రైతుల స్థానంలో తమ బినామీల బ్యాంక్ అకౌంట్ నంబర్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో పశుసంవర్ధక శాఖ నుంచి డబ్బు నేరుగా బినామీ ఖాతాల్లో పడ్డాయి. దాదాపు రెండు కోట్ల పైగా నగదును అధికారులు, కాంట్రాక్టరుతో కలిసి తప్పుడు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కోన్నారు. గొర్రెపిల్లలు తీసుకెళ్లి నెలలు గడుస్తున్నా తమ అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో అనుమానంతో రైతులు.. కొండాపూర్‌లోని సయ్యద్ మోయీద్ కార్యాలయంలో నిలదేశారు. ప్రభుత్వం నుంచి డబ్బు విడుదల కాలేదని అతను మాయమాటలు చెప్పాడు. దీంతో రైతులు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించగా... తమకు రావాల్సిన డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలుసుకున్నారు. గత డిసెంబర్ 20న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్‌తో పాటు ADలు రవికుమార్, కేశవసాయిపై కేసు నమోదు చేశారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో పుంగనూరు రైతుల వద్ద ఆవులు కొనుగోలు చేసి వారిని సైతం మోసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story