SAD: ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ సహా సహకారం సంఘంలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ మృతి చెందారు. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పని చేస్తోన్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యం కావడంతో ఆందోళన నెలకొంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఎస్సై ఆచూకీ కోసం గాలించగా కొద్దిసేపటి తర్వాత ఉదయం ఎస్సై మృతదేహం లభ్యమైంది.
అసలు ఏం జరిగిందో..
గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో పని చేస్తుండగా.. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి బదిలీపై భిక్కనూరు వచ్చారు. ఎస్సై అక్కడ పని చేసిన సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలేంటి.? అసలేం జరిగింది.? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఫోన్ సిగ్నల్ ఆధారంగా..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్ సెల్ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. అటు, బీబీపేట ఠాణాలో పనిచేస్తోన్న లేడీ కానిస్టేబుల్ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు గాంధారి మండలం గుర్జాల్లో ఉంటున్నారు ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com