Nama Nageswara Rao: ఎంపీ కొడుకుపై దాడి.. కత్తితో బెదిరించి రూ.75 వేలు దోపిడీ..

Nama Nageswara Rao: ఎంపీ కొడుకుపై దాడి.. కత్తితో బెదిరించి రూ.75 వేలు దోపిడీ..
Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై దాడి చేసి 75 వేలు దోచుకున్నారు దుండగులు.

Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై దాడి చేసి 75 వేలు దోచుకున్నారు దుండగులు. హైదరాబాద్‌ టోలీచౌకీలో కారును అడ్డగించి అందులో ఎక్కిన దుండగులు.. కత్తితో బెదిరించి ఈ దోపిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పృథ్వీతేజ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

పృద్వీతేజ కేసులో అసలేం జరిగిందో పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రరెడ్డి వివరించారు. జులై 30న పృద్వీతేజ ఫిర్యాదు చేశారని తెలిపారు. టోలిచౌకి వద్ద పృద్వీతేజ కారుకు అడ్డంగా బైక్ ఆపారని.. ఆ తర్వాత బైక్‌పై నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు పృద్వీ కారులోకి ఎక్కారని చెప్పారు. కారులో ఎక్కిన తర్వాత పృద్వీని భయపెట్టి 75 వేల రూపాయలు ఫోన్‌పే చేయించుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కారులోకి మరో ముగ్గురు వ్యక్తులు ఎక్కారన్న సీఐ హరిశ్చంద్రరెడ్డి..

మొత్తం కారులో పృద్వీతేజతో సహా ఆరు మంది ఉన్నారని చెప్పారు. టౌలిచౌకి నుండి గచ్చిబౌలి, కొండాపూర్, ఎస్ఆర్ నగర్ మీదుగా పంజాగుట్ట చౌరస్తాకు చేరుకున్నారని తెలిపారు. ఆ తర్వాత పంజాగుట్ట చౌరస్తా రాగానే పృద్వీ తప్పించుకుని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడని స్పష్టంచేశారు. పృద్వీతేజ ఇచ్చిన ఫిర్యాదుతో 395 ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. పృద్వీ హైరేంజ్ కారుని చూసి నిందితులు దారి దోపిడీకి పాల్పడ్డారని సీఐ హరిశ్చంద్రరెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story