TG: విద్యుత్‌ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ రాజీనామా

TG: విద్యుత్‌ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ రాజీనామా
X
సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం...రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్‌ నరసింహారెడ్డి

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ కమిషన్‌ ఏర్పాటు నోటిఫికేషన్‌ను సైతం కొట్టేయాలన్న కేసీఆర్‌ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. కమిషన్‌ ఏర్పాటు, దాని ఛైర్మన్‌ నిష్పాక్షికతను సవాల్‌ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారంచింది.

కేసీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, సిద్ధార్థ్‌ లూథ్రా, విచారణ కమిషన్, జస్టిస్‌ నరసింహారెడ్డి తరఫున గోపాల్‌శంకర్‌ నారాయణన్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విచారణ సమయంలోనే జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ముందస్తు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరిగా లేదని, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించడం మేలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కొత్త పేరును ప్రతిపాదించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. అందుకు ఆయన అంగీకరించారు.

కోర్టు తిరిగి సమావేశమైన తర్వాత అనూహ్యంగా జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు న్యాయవాది ద్వారా ధర్మాసనానికి లేఖ సమర్పించారు.‘విలేకరుల సమావేశంలో కొన్ని విషయాలపై తాను వ్యక్తంచేసిన అభిప్రాయాలపై న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తనకు సమాచారం అందిందని... ఈ నేపథ్యంలో తాను స్పష్టత ఇస్తున్నట్లు జస్టిస్‌ నరసింహారెడ్డి కోర్టుకు తెలిపారు, న్యాయమూర్తి అయినా, మాజీ న్యాయమూర్తి అయినా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారన్న నమ్మకం ఉండాలని.... ఒకవేళ దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ కార్యాలయం తన ప్రతిష్ఠను కోల్పోతుందని తెలిపారు. అందుకే న్యాయవ్యవస్థ గౌరవమర్యాదలను కాపాడటానికి సూచికగా కమిషన్‌ ఛైర్మన్‌గా కొనసాగే ఉద్దేశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌... జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని, ఎవర్ని నియమిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా నియమించే న్యాయమూర్తి నుంచి వ్యక్తిగత సమ్మతి తీసుకోవాల్సి ఉన్నందున సోమవారం వరకు సమయమివ్వాలని ప్రభుత్వం కోరడంతో సీజేఐ అంగీకరించారు.

Tags

Next Story