ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం..!

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి 7 రాష్ట్రాలకు విస్తరించింది. అలాగే తూర్పు గాలులతో బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి... తమిళనాడు నుంచి ఒడిసా తీరం వరకు విస్తరించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాతావారణం మారిపోయింది. అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా హైదరాబాద్లో రెండు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
పలు చోట్ల వర్షాలు పడుతుండటంతో చలి పెరిగింది. శనివారం హైదరాబాద్లో 28 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు చల్లని వాతావరణం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అకాల వర్షాలతో పంట ఉత్పత్తులు పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com