TG: ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్

ఆదాయనికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో హైదరాబాద్ CCS ఏసీపీ ఉమామహేశ్వరరావు అనిశా అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఉదయం ఐదు గంటల నుంచి ఏక కాలంలో 14చోట్ల సోదాలు చేసిన అనిశా అధికారులు.. మూడున్నర కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రపదేశ్లోనూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. సోదాలు అనంతరం అతన్ని అరెస్టు చేసిన పోలీసులు... అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.
పోలీసు శాఖలో అక్రమాల అధికారి అవినీతి నిరోధకశాఖకు చిక్కాడు. హైదరాబాద్ CSS ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావును అనిశా అరెస్ట్ చేసింది. నిన్న ఉదయమే హైదరాబాద్ అశోక్ నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న అనిశా బృందం... అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం సోదాలు ప్రారంభించింది. తెలంగాణ, ఏపీలో 14 చోట్ల బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన సోదాల్లో భారీగా నగదు, ఆభరణాలు, భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఇంట్లో 500రూపాయల నోట్లతో కూడిన కట్టలు లభ్యం కావడం దర్యాప్తు అధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తొలుత ఉమామహేశ్వరరావు దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నిరాకరించారు. అయితే అతడి ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టా వివరాలను దర్యాప్తు అధికారులు బయటపెట్టడంతో నోరు విప్పక తప్పలేదు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని.. అధికారులు తెలిపారు.
ఉమామహేశ్వరరావు సీసీఎస్లో పనిచేసిన సమయంలో స్థిరాస్తి సంస్థ సాహితీ ఇన్ఫ్రా మోసానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పలు వెంచర్లలో వందలాది మంది వినియోగదారుల నుంచి.. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 2000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఫ్లాట్లు ఇవ్వలేదనేది ఆ సంస్థపై అభియోగం. కొన్ని ప్లాట్లకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ మోసంలోనే సంస్థ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతోపాటు... ఆయన కుటుంబసభ్యులపైనా హైదరాబాద్ సీసీఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన ఉమామహేశ్వరరావు.. సంస్థ నిర్వాహకులతో అంటకాగారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే భారీగా ముడుపులు తీసుకొని లక్ష్మీనారాయణ తరపున వకాల్తా పుచ్చుకున్న ఉమామహేశ్వరరావు..... బాధితులనే బెదిరించారనే ఆరోపణలున్నాయి. దీంతో పలువురు బాధితులు ఉమామహేశ్వరరావు పేరిట గల ఆక్రమాస్తుల గురించి ఆరా తీసి.. అనిశాకు అందించారని తెలుస్తోంది.
ఉమామహేశ్వరరావు ఇంట్లో లభించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సందీప్ అనే పేరుండటం దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఇతడితో కలిసి ఉమామహేశ్వరరావు వ్యాపార, స్థిరాస్తి లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డైరీల్లోనూ అతడి పేరుండటంతో సందీప్ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా.. అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అతడి గురించిన సమాచారంతోపాటు.. ఆదాయానికి మించిన ఆస్తుల గురించి పూర్తిగా విశ్లేషించేందుకు ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com