Telangana: అధికారమే లక్ష్యం..

Telangana: అధికారమే లక్ష్యం..
తెలంగాణలో అధికారం చేపట్టాలని కసితో ఉన్న బీజేపీ

తెలంగాణలో అధికారం చేపట్టాలన్న కసితో బీజేపీ పనిచేస్తుంది. ఇందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూనే బీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతుంది. ఇందుకోసం యూపీలో విజయం సాధించిన త్రిముఖ వ్యూహాన్ని తెలంగాణలోనూ ప్రయోగిస్తోంది. ఇప్పటికే తెలంగాణపై ప్రత్యే దృష్టి పెట్టిన బీజేపీ హైకమాండ్‌ క్షేత్రస్థాయి నుంచే పని మొదలుపెట్టింది. కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతల పర్యటనలతో తెలంగాణ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.


యూపీ ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయ్యేందుకు సిద్ధమైంది కమల దళం. ఈ వ్యూహంలో భాగంగా పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. దశలవారీగా నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ-అమిత్ షా వరస పర్యటనలు, సభలకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి.


ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపే నాలుగు నుంచి ఐదు బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా ప్రధాని మోదీ హాజరయ్యేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ప్రతీ కార్యక్రమం 15 రోజులపాటు కొనసాగేలా ప్రణాళికలు వేస్తోంది. సంస్థాగతంగా బూత్‌ కమిటీ అధ్యక్షులను, శక్తికేంద్రాల ఇంఛార్జులను నియమించనుంది. కేంద్రంపై విమర్శలను తిప్పికొడుతూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా నేతల్ని సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల కార్నర్‌ సమావేశాలు నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి 25వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాల తొలిరోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంఛార్జులతో పాటు జాతీయ పార్టీ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోని ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు హాజరువుతారు.


ఇక రెండో దశలో ఒక్కో మండలం ఒక్కో యూనిట్‌గా ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో బైక్‌ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ ర్యాలీలు సుమారు 15 రోజుల పాటు జరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. మూడో దశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించనున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story