Telangana: సర్కార్‌కు గవర్నర్ షాక్.. మూడు బిల్లులకు ఓకే రెండీటికి నో

Telangana: సర్కార్‌కు గవర్నర్ షాక్.. మూడు బిల్లులకు ఓకే రెండీటికి నో
పెండింగ్ లో ఉన్న పది బిల్లుల్లో కేవలం మూడింటికి మాత్రమే ఆమోదం తెలిపిన తమిళ సై రెండింటిని తిరస్కరించారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్ లో ఉన్న పది బిల్లుల్లో కేవలం మూడింటికి మాత్రమే ఆమోదం తెలిపిన తమిళ సై రెండింటిని తిరస్కరించారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో రెండింటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

చాలాకాలంగా పెండింగ్ లో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇటీవల బడ్జెట్ సమవేశాలకు ముందు బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. చివరికి ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపడంతో అంతా సమస్య పరిష్కారమైందని అనుకున్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఎలాంటి వివాదం ఏర్పడకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని భావించారు. కానీ తమిళిసై మాత్రం బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

సుప్రీంకోర్టులో విచారణకు ముందే గవర్నర్ తమిళ్ సై మూడు బిల్లును ఆమోదించారు. ఇక ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటారు వెహికిల్ చట్ట సవరణ బిల్లును రాష్ట్రపతికి పంపించారు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీలో ఏర్పాటు బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లులను ఆమోదించకుండానే ప్రభుత్వానికి తిరిగి పంపారు. ప్రభుత్వం కీలకంగా భావించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానాలతో కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బిల్లులు క్లియర్ చేసుకొని అసంతృప్తివాదులకు చెక్ పెట్టాలని భావించినా గవర్నర్ నిర్ణయం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story