TG: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 11 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగగా... 97 గంటల 32 నిమిషాలు సభ జరిగింది. 12 బిల్లులను శాసనసభ ఆమోదించింది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, బీఆర్ఎస్ 38, బీజేపీ 8, ఎంఐఎం7, సీపీఐ ఒక సభ్యుడు పాల్గొన్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025 ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలు గత నెల ఫిబ్రవరి 24న ప్రారంభమై, మార్చి 27వ తేదీ వరకు కొనసాగాయి .
అసెంబ్లీలో రేవంత్ vs కేటీఆర్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్రం అన్యాయం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం లేదని కేటీఆర్ అన్నారు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదని... ప్రభుత్వం ఏం చేసినా తాము భయపడబోమని విమర్శించారు. దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు.
శాసనసభలో సీఎం రేవంత్ భావోద్వేగం
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదన్నారు. తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని స్పష్టం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని రేవంత్ ఎమోషనల్ అయ్యారు.
గాంజా రాజు.. లిక్కర్ రాణి: భట్టి
బీఆర్ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతల గురించి బయట చాలా మాట్లాడుకుంటున్నారని... గాంజా రాజు.. లిక్కర్ రాణి అంటున్నారని అన్నారు. పరోక్షంగా కవిత, కేటీఆర్ పై భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే చాలా అభివృద్ధి చేసిందని భట్టి వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com