ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 28 వరకు కొనసాగనున్నాయి.. తొలిరోజు అసెంబ్లీ ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.. మొత్తం 17 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో సెలవులు ప్రకటించారు.. అసెంబ్లీలో గంట సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఆరు ప్రశ్నలకు మాత్రమే అనుమతిచ్చారు.. జీరో అవర్ను అరగంటకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక ఈనెల 10, 11 తేదీల్లో రెవెన్యూ చట్టంపై చర్చ జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.. అటు అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ సభ్యులను కోరారు.
అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేయడంపై బీఏసీ సమావేశంలో హాట్ హాట్ చర్చ జరిగింది.. ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య ఈ అంశంపై చర్చ జరిగింది.. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడాన్ని భట్టి విక్రమార్క తప్పుపట్టారు.. అయితే, దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తి దృష్టిలో ఉంచుకునే ఎత్తివేయాల్సి వచ్చిందని చెప్పారు. సభ కంటే మీడియా పాయింట్ ఎక్కువైందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో సమయం ఇస్తామని, దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలు వినిపించాలని సీఎం సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com