TS: నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

TS: నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు
X
ఏడు నుంచి పది రోజుల పాటు నిర్వహించే అవకాశం.... నేడు బీఏసీ భేటీ

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం సుమారు ఏడు నుంచి పది రోజుల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇవాళే స్పీకర్‌ సమక్షంలో బిజినెస్‌ ఎడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది. శాసనసభ నిర్వహణ తేదీలను, ఎజెండాను ఇందులో ఖరారు చేస్తారు. 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశమై.. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

గత డిసెంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తీరును అనుసరిస్తోంది. అధికార, విపక్షాల సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని ప్రస్తావిస్తూనే.. మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అధికారపక్షం అసెంబ్లీలో ప్రస్తావించనుంది. ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, గ్రూప్‌-1 నోటికేషన్ల జారీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చించనుంది. రూ.2 లక్షల రుణమాఫీ అమలుతో రైతులకు కలిగిన లబ్ధిని వివరించనుంది.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు దిశగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించనుంది. రైతు భరోసా విధివిధానాలపైనా చర్చించనుంది. మేడిగడ్డపై తన వైఖరిని కూడా సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలూ ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వ చిహ్నం రూపకల్పనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో సీఎం ప్రకటించడంతో.. వీటిపైనా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో.. ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న రోజు శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారపక్షం చేసే విమర్శలకు దీటుగా సమాధానమివ్వడానికి బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. గత ఏడు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన తీరును అసెంబ్లీలో ప్రస్తావించడానికి సిద్ధమవుతోంది.

Tags

Next Story