Telangana budget 2022-23 : ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana budget 2022-23 : ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
Telangana budget 2022-23 : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్స రానికి వార్షిక పద్దు పై చర్చించి ఆమోదం తెలిపింది.

Telangana budget 2022-23 : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్స రానికి వార్షిక పద్దు పై చర్చించి ఆమోదం తెలిపింది కేబినెట్. ఇవాళ ఉదయం11.30 నిమిషాలకు శాసనసభలో బడ్జెట్‌‌ని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టనున్నారు. ఇక మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. దాదాపు రెండు లక్షల 50 వేల కోట్ల బడ్జెట్‌‌ని పెట్టె ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

మరోవైపు బడ్జెట్‌ సమావేశాలపై అస్తశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంటే వారిని దీటుగా ఎదుర్కొనేందుకు అదే స్థాయిలో ప్రిపేర్ అయింది గులాబీ పార్టీ. గత సమావేశాలు ప్రొరోగ్ కానందున ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఈ విషయంలో ఇప్పటికే గవర్నర్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖను కూడా విడుదల చేశారు. సభలో తన ప్రసంగం లేకుండా ప్రభుత్వం సభ్యులు యొక్క హక్కులను కాలరాస్తూ నిర్ణయం తీసుకుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. ఈ విషయంపై విపక్ష నేతలు అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణ, సభలో అనుసరించాల్సిన వ్యూహం పై మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ లకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

ఇక కరోనా నుంచి కోలుకున్న రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో బడ్జెట్ అంచనాలు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, పెరిగిన జీతభత్యాలతోపాటు దళితబంధు లాంటి మెగా స్కీమ్స్ అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఏటా బడ్జెట్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలను దళిత బంధు కోసం కేటాయిస్తామని ఇప్పటికీ ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే 15 శాతం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రెండు లక్షల 45 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించి సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా బడ్జెట్ పద్దులపై అంశాలవారీగా చర్చ జరగాల్సి ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు వీలైనంత ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక బిల్లులను కూడా ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం వంటి పూర్తి వివరాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాలు ఈసారి గరంగరంగా సాగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు అంశాల వారీగా ఏ మేరకు రాష్ట్రానికి నష్టం జరిగిందో లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఒక తీరుగా... తెలంగాణకు మరో విధంగా కేంద్రం వివక్ష చూపుతోందని బీజేపీని నిలదీయనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక విధానాలు, బొగ్గు గనుల వేలం, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని అసెంబ్లీ వేదికగా తూర్పార పట్టనున్నారు. సెస్ పేరుతో పన్నుల మీద పన్నులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వేధిస్తున్న తీరుపై బడ్జెట్ సమావేశంలో టీఆర్ఎస్ సర్కార్ ఎండగట్టనుంది. రాష్ట్రాలకు సర్ ఛార్జ్, సెస్సులను వేస్తూ ఆదాయం రాకుండా కేంద్రం మోసం చేస్తుందని సభా వేదికగా సర్కారు నిరసన తెలిపనుంది.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ కంటే రాజకీయ రచ్చే ఎక్కువగా ఉంటుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌‌లో జరుగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ కేంద్రం మధ్య జరుగుతున్న డైలాగ్ వార్.. ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరగనుండటంతో అసెంబ్లీ వేదికగా మరింత హీట్ పెంచనుంది.

Tags

Read MoreRead Less
Next Story