TG: కాళేశ్వరం విచారణ ఖర్చు ప్రభుత్వానిదే

TG: కాళేశ్వరం విచారణ ఖర్చు ప్రభుత్వానిదే
X
తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థలదే... సూత్రప్రాయంగా అంగీకారం

తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ N.D.S.Aసూచించిన ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు సమాచారం.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా.. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌లో ఉందా.. లేదా...? ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కనపెట్టి.... N.D.S.A సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడంపైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్స్‌ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

డిజైన్‌లో లోపం కాబట్టి.. తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ.. నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15నే ధ్రువీకరణ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లు గడిచాయని.. పేర్కొంది. ఇప్పుడు తమది బాధ్యత కాదంది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని.. 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని E.N.Cకి ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతు పనులను నిర్మాణ సంస్థ L అండ్‌ T చేపట్టింది. సీసీ బ్లాకులను పునరుద్ధరించడం.. ఎగువ, దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం.. బుంగలను ఇసుక బస్తాలతో పూడ్చడం లాంటి పనులతోపాటు ఏడో బ్లాక్‌లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది. ఈ పనిలో L అండ్‌ T వాటా 80 శాతం కాగా.. P.E.S అనే సంస్థది 20 శాతం. ఈ సంస్థే గేట్లను అమర్చే పని చేసినట్లు తెలిసింది. 15వ గేటును పైకెత్తగా, 16వ గేటు ఎత్తడానికి ప్రయత్నించిన సమయంలో సమస్య రావడంతో నిలిపివేశారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించడంతోపాటు మిగిలిన గేట్లను పైకెత్తడం, ఇందులో ఏమైనా సమస్య వస్తే తొలగించడం చేయాల్సి ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల విజ్ఞప్తి మేరకు పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి వెళ్లింది. చేయాల్సిన పరీక్షలు, అందుకయ్యే వ్యయం వివరాలను త్వరలోనే ఈ బృందం అందజేయనుంది. మరోవైపు, మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కాంక్రీటు స్ట్రక్చర్‌కు జియో ఫిజికల్, జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ను దిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ పరిశోధనా సంస్థతో చేయించాలని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సూచించారు. ఈ సంస్థ పేరును సైతం N.D.S.A సిఫారసు చేసింది. ఈ పరీక్షలు చేయించడానికి 2కోట్ల 46 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూడు బ్యారేజీలకు ఎన్‌.డి.ఎస్‌.ఎ. సూచించిన పరీక్షలన్నీ చేయించడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags

Next Story