Telangana Cabinet expansion: నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నరకు పైగా కేబినెట్ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్నారు. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు లభించిబోతున్నట్లు సమాచారం. కేబినెట్లో మొత్తం 6 స్థానాలు ఖాళీ ఉండగా నేడు ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొన్ని నెలలుగా ఢిల్లీ స్థాయిలో అనేకసార్లు చర్చలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేక మంది ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలు తీసుకుని హైకమాండ్కు ఈ మేరకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.
తీవ్ర ప్రయత్నాలు
కేబినెట్లో చోటు కోసం కొంతమంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్సాగర్రావు, మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి రేసులో ఉన్నారు. నల్లగొండ నుంచి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. మరోవైపు తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలని కొద్దిరోజుల నుంచి పలువురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ఈరోజు రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్భవన్ వర్గాలను సీఎం కోరినట్లు తెలుస్తోంది. నేడు కేబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
గవర్నర్కు సమాచారం
నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్శర్మకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళే నాలుగైదు ముహుర్తాలు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పేర్లు నిర్ధరణ అయ్యాక.. ఏ ముహుర్తంలో ప్రమాణస్వీకారం ఉంటుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో కచ్చితంగా ప్రాతినిథ్యం కల్పించాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది నేతలు కేబినెట్ రేసులో ఉండటంతో.. ఎలాంటి సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈసారి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే . కేబినెట్లో చోటు ఆశించే వారి సంఖ్య భారీగా ఉండటంతో.. అనేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశావాహులు అసంతృప్తి చెందకుండా మరో మూడు స్థానాలు ఖాళీ ఉంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com