CABINET: కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులు

CABINET:  కేబినెట్‌లోకి ముగ్గురు మంత్రులు
X
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ... వివేక్, లక్ష్మణ్‌కుమార్‌, శ్రీహరికి చోటు.. ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్

తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏడాదిన్నరకుపైగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గం విస్తరణ ముగిసింది. రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ), బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించారు.

సామాజిక న్యాయమే ధ్యేయంగా...

సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్‌, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్‌, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు అవకాశం దక్కింది. లంబాడా సామాజిక వర్గం నుంచి రామచంద్రు నాయక్‌ను ఉపసభాపతిగా ఎంపిక చేశారు.

రేవంత్ శుభాకాంక్షలు

రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెుదట వివేక్ వెంకటస్వామి ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చివరగా వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వివేక్ ఇంగ్లీష్‌లోఅడ్లూరి, వాకిటి తెలుగులో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కొత్త మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.

ముగ్గురు తొలిసారి ఎమ్మెల్యే అయినవారే

కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం విశేషం. వివేక్ గతంలో ఎంపీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఖాళీగా మరో 3 స్థానాలు

అయితే మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌ రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.

Tags

Next Story