GHMC మినహా అన్ని జిల్లాల్లో సర్వే పూర్తి

గత నెల 6న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే పూర్తయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 4, 5 రోజుల్లో GHMC పరిధిలో కూడా ఈ సర్వే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్లో భద్రపరుస్తున్నారు.
పూర్తవుతున్న డిజిటలైజేషన్
ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన సమాచారాన్ని ప్రస్తుతం డిజిటైలైజ్ చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్లో కుల గణన సర్వే వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం మేర కంప్యూటీకరణ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకో నాలుగైదు రోజుల్లోనే పూర్తి సమాచారం డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. డేటా ఎంట్రీలో ఎక్కడా తప్పులు జరగకుండా కోడ్స్ సిస్టమ్ను అమలు చేశారు. మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్ను సెలెక్ట్, టిక్ చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో హ్యుమన్ ఎర్రర్స్ కూడా చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. డిజిటలైజేషన్ తర్వాత ఏయే సమాచారం నివేదిక రూపంలో ఇవ్వాలనే దానిపై డేటాను కంపైల్ చేసి, ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాష్ట్రంలో సేకరించిన సమగ్ర ఇంటింటి కుల గణన సమాచారాన్ని ఒక పుస్తక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. అప్పటికీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నట్లయితే.. అవసరం అనుకుంటే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
సర్వే సమాచారం సాఫ్ట్వేర్లో లాక్
సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే పూర్తి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు కూడా పూర్తి సమాచారం ఇవ్వొద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎంత దాకా కమిషన్ డేటా అవసరమో అంతే ఇవ్వాలని సూచించింది. దీంతో సమాచారం జాగ్రత్తగా సాఫ్ట్వేర్లో లాక్ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com