Telangana: గవర్నర్, గవర్నమెంట్ మధ్య పోరు.. అసెంబ్లీలో ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం..

Telangana: గవర్నర్, గవర్నమెంట్ మధ్య పోరు..  అసెంబ్లీలో ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం..
Telangana: అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ.. కొనసాగింపు అనడం అనైతికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉన్నప్పటికీ.. రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై పేర్కొన్నారు. రేపటినుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ప్రభుత్వ నిర్ణయంతో అసెంబ్లీలో గవర్నర్‌ అడుగు పెట్టకుండానే ఈసారి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతోంది. గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌కపోవడంతో వివాదం రాజుకుంది. ప్ర‌భుత్వ వ‌ర్గాలు కౌశిక్ రెడ్డి అభ్య‌ర్ధిత్వాన్ని ఆమోదించాల‌ని కోరిన‌పుడు.. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయ‌ని చెప్పారు.

అలా గ‌వ‌ర్న‌ర్ భావించిన‌పుడు దాన్ని రిజ‌క్ట్ చేయాల‌ని చెప్పినా ఆమె చేయ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ ఉద్దేశ‌పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌భుత్వ సిఫార్సును తొక్కిపెట్టింద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఇక గ‌వ‌ర్న‌ర్ శాస‌న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించినా.. జ‌న‌వ‌రి 26 నాడు జెండా ఎగుర‌వేసి మాట్లాడినా ప్ర‌భుత్వం ఆమోదించిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే చ‌దవాలి.

రాజ్యాంగం ప్రకారం సొంతంగా ప్ర‌సంగాలు చేయ‌డానికి వీల్లేదు. ఈసారి జ‌న‌వ‌రి 26న క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎలాగూ బ‌హిరంగ స‌భ లేదు కాబ‌ట్టి ఎలాంటి ప్ర‌సంగాలు వ‌ద్ద‌నుకున్నారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ అనూహ్యంగా 26 జ‌న‌వ‌రి నాడు ప్ర‌సంగించారు. ఇది ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే చ‌ర్య‌గానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

ఇక శాస‌న‌మండ‌లికి ప్రొటెం ఛైర్మ‌న్ గా ఎంఐఎం స‌భ్యులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమీనుల్ జాఫ్రీని రిక‌మండ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఫైల్‌ను గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే, గ‌వ‌ర్న‌ర్ దీనిపై నిర్ణ‌యం తీసుకోకుండా నాన్చివేత దోర‌ణితో వ్య‌వ‌హ‌రించారు. ప్రొటెం ఛైర్మ‌న్ ఎందుకు డైరెక్ట్‌గా చైర్మ‌న్ ఎన్నిక పెట్టండని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 13 నెల‌ల‌పాటు ప్రొటెం ఛైర్మ‌నే ఉన్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పిన‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ బెట్టు చేశారు.

చివ‌ర‌కు దేశంలో ఏఏ రాష్ట్రాలు ప్రొటెం ఛైర్మ‌న్లుగా ఎన్నినెల‌లు, ఎంత కాలం ఉంచింద‌న్న స‌మాచారాన్ని సేక‌రించి ప్రభుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేసింది. దీంతోపాటు రాజ్యాంగం ఏం చెప్తున్న‌దో కూడా చెప్పింది. చివ‌ర‌కు జాఫ్రీని ప్రొటెం ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. దేశంలో, మ‌న రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్లకు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి త‌లెత్తిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

గ‌తంలో రాంలాల్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌పుడు నాటి ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. త‌ర్వాత ఆయ‌న చాలా అవ‌మాన‌క‌రంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. అనంతరం క్రిష్ణ‌కాంత్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌పుడు కూడా ఇలాగే జ‌రిగింది. నిన్న‌మొన్న మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌న అతివ‌ల్ల శాస‌న‌స‌భ‌లో అవ‌మాన‌క‌రంగా స‌భ జ‌రుగుతుండ‌గానే నిష్క్ర‌మించాల్సి వ‌చ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి, రాజ్యాంగ బ‌ద్దంగా న‌డుచుకునే ధోర‌ణి గ‌వ‌ర్న‌ర్ల‌కు ముఖ్యం.

ఇలా కాకుండా కేంద్ర ప్ర‌భుత్వాల‌కు తోలుబొమ్మ‌లుగా మారిన ఏ గ‌వ‌ర్న‌ర్ కూడా ఎక్కువ కాలం రాష్ట్రాల్లో ప‌నిచేయ‌లేక‌పోయారు. న‌ర‌సింహ‌న్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న‌పుడు, ఉద్య‌మం సమయంలో కేసీఆర్‌తో విభేదించారు. కానీ, కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక కూడా ఆయ‌నే గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఉండేది. రెండు వ్య‌వ‌స్థ‌ల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉండేది.

కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నాయి TRS వ‌ర్గాలు. త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన త‌మిళిసై.. గ‌వ‌ర్న‌ర్‌గా తెలంగాణకు వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌నపాత వాస‌న‌లు పోగొట్టుకోలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌భుత్వం కాళ్ల‌లో క‌ట్టేపెట్టే ప్ర‌య‌త్నం చేస్తోందంటున్నారు. ఇక గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్‌ ఎపిసోడ్‌కు ఎపుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story