నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం..

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశం..
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. వేతన సవరణ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, సర్వీసు నిబంధనలు, పదోన్నతులపై చర్చించనున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. వేతన సవరణ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, సర్వీసు నిబంధనలు, పదోన్నతులపై చర్చించనున్నారు. ప్రధానంగా ఫిట్‌మెంట్‌పైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున ఫిట్‌మెంట్‌ వాయిదాపై ఉద్యోగ సంఘాలను మెప్పించే ప్రయత్నం జరగొచ్చని తెలుస్తోంది. టీఎన్జీవో, టీజీవో, ట్రెసా, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘాలకు చెందిన ప్రతినిధులంతా ఇవాళ అందుబాటులో ఉండాలని సీఎంఓ సంకేతాలు ఇచ్చింది. వివిధ సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ లంచ్ చేయనున్నారు. ఆ తరువాత ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఉంటుంది.

ఫిట్‌మెంట్‌తోపాటు సర్వీసు నిబంధనలపై చర్చించడానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని వేశారు. కానీ, ఈ కమిటీ సమావేశాలు నిర్వహిస్తే ఫలితం వచ్చే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతోనే సీఎం స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతనాలకు సంబంధించి నివేదికను పీఆర్సీ.. ఇవాళ లేదా జనవరి 2న ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి. ఫిట్‌మెంట్‌పై మూడు శ్లాబులను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రధానంగా వేతన సవరణతోపాటు పదవీ విరమణ వయసు పెంపు, కేడర్‌ పోస్టుల అంశాలను నివేదికలో ప్రస్తావించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నివేదికను అందించనుంది.

మరోవైపు సీఎస్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరపనుంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. 32 నెలల కిందట బిశ్వాల్‌ చైర్మన్‌గా, ఉమామహేశ్వరరావు, మహ్మద్‌అలీ రఫత్‌ సభ్యులుగా ప్రభుత్వం తొలి పీఆర్‌సీని వేసింది. దీని గడువు ఇవాళ్టితో ముగియనుంది.

అటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకే పెంచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్‌ గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ కూడా ఈ విధంగానే నివేదిక ఇవ్వొచ్చని అంటున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చింది టీఆర్‌ఎస్. కానీ, 61 ఏళ్లకు పెంచితే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story