singareni : సింగరేణి గనిలో ప్రమాదం... దుర్ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి..!

singareni : సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో నిన్న మధ్యాహ్నం పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. గనిలోని 86 లెవల్ వద్ద వారం రోజుల క్రితం పైకప్పు కూలిందని.. దాన్ని సరిచేసేందుకు ఉద్యోగులతో సపోర్టింగ్ పనులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఒక్కసారిగా సైడ్తో పాటు పైకప్పు కూలింది. ఆ సమయానికి అక్కడ పైభాగంలో విధులు నిర్వహిస్తున్న వారు పరుగుతీశారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి అడ్డంగా.. పైకప్పు కూలింది. దీంతో అధికారి జయరాజ్, గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ, బదిలీ వర్కర్ రవీందర్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్లతో పాటు వెంకటేశ్వర్లు, నరేశ్లు బొగ్గుపొరల మధ్య చిక్కుకుపోయారు. అందులో వెంకటేశ్వర్లు, నరేశ్లను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. మిగతా నలుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో పనిచేస్తున్న సపోర్ట్ మెన్ కార్మికుడు వీరయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా పైకి చేరుకున్నారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింగరేణి బొగ్గు గని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టామని, కూలిన శిథిలాల నుంచి కార్మికులను బయటకు తెచ్చే చర్యలు ముమ్మరం చేశామని సీఎంకు శ్రీధర్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com