REVANTH: దక్షిణాదిపై బీజేపీకి ఎందుకింత కక్ష

REVANTH: దక్షిణాదిపై బీజేపీకి ఎందుకింత కక్ష
X
డీలిమిటేషన్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు... రాజకీయ లబ్ది కోసమే పునర్విభజన కుట్ర అన్న సీఎం

నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికే కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఎంత ప్రయత్నించినా దక్షిణాదిలో బీజేపీ బలపడదని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసని రేవంత్ అన్నారు. అందుకే డీలిమిటేషన్ అనే ఆయుధంతో కుట్రకు తెరలేపారన్నారు. పార్లమెంట్‌‌లో ద‌‌క్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని త‌‌గ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

బీజేపీకి కావాల్సింది రాజకీయమే..

బీజేపీకి కావాల్సింది రాజకీయ లబ్ధి తప్ప.. మరొకటి కాదని... అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను వెతకడం ఆ పార్టీకి అలవాటే అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ కుట్రను గుర్తించి, ఆ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకుంటారా? అని మండిపడ్డారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమి టేషన్ చేపడితే..1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నేడు అన్ని పార్టీల ఎంపీలతో రేవంత్ భేటీ

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌లతో పాటు ఎంపీలందరికీ భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. తెలంగాణ రుణభారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటాల పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌పై చర్చించనున్నారు.

గ్యారంటీలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణపై అప్పు రూ.7 లక్షల కోట్లకు చేరుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'మొదటగా తాను ఈ మొత్తాన్ని రూ.3.75 లక్షల కోట్లు మాత్రమేనని భావించాను. ప్రతి నెలా రాష్ట్రానికి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుండగా జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు రూ.13 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన రూ.5,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమానికి. గ్యారంటీలను అమలు చేయమని చెప్పడం లేదు. పరుగు కొనసాగుతోంది.' అని అన్నారు.

Tags

Next Story