REVANTH: గ్రూప్-1 పోస్టుల భర్తీపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకు వెళ్లే వారు తప్పక సివిల్స్లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సీఎ రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. బిహార్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని.. ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు.
బిహార్ నుంచే అత్యధికమంది....
వెనుకబడిన రాష్ట్రమైన బిహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తున్నారని పేర్కొన్నారు. సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. సింగరేణి సంస్థ నుంచి సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. బిహార్ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు. వీరంతా సివిల్స్లో విజయం సాధించి తెలంగాణకే రావాలని ఆకాంక్షించారు.
ఆ నగరాలతో పోటీ పడుతున్నాం: సీఎం రేవంత్
న్యూయార్క్, లండన్, టోక్యో వంటి ప్రముఖ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) నేతృత్వంలో హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారికి అన్ని విధాలా సహకరిస్తామని.. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించాలని రేవంత్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com