TS: రేవంత్ బృందానికి ఘన స్వాగతం

TS: రేవంత్ బృందానికి ఘన స్వాగతం
X
స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.. దావోస్ పర్యటన విజయవంతంపై హర్షం

తెలంగాణకు భారీగా పెట్టుబడులు రాబట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం.. హైదరాబాద్ లో కాలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్, దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డి బృందానికి.. కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్‌, దావోస్‌ పర్యటన విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డిని కొనియాడారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, దానం నగేందర్‌, ఇతర నేతలు... రేవంత్ బృందానికి ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి దానికి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అన్ని హంగులతో ఫోర్త్ సిటీ: టీపీసీసీ

దావోస్ పర్యటన విజయవంతం కావడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ. 27,500 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ లక్షా 78 వేల కోట్ల పెట్టుబడులు రావడం హర్షనీయమని అన్నారు. అన్ని హంగులతో ఫోర్త్ సిటీ రాబోతోందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని కొనియాడారు.

సీఎం రేవంత్‌పై పాల్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా కృష్ణారెడ్డిని తిట్టిన రేవంత్ ఇప్పుడు ఆయనకే ప్రాజెక్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం కాదు ఇది కూళేశ్వరమని, కాళేశ్వరాన్ని మూసేస్తున్నామని ఇటీవల కూడా పలువురు మంత్రులు అన్నారని ఆరోపించారు. అలాంటి కాళేశ్వరానికి సంబంధించిన 15వేల కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్టును మేఘాకి ఇస్తూ రేవంత్ ఎలా సైన్ చేశారని మండిపడ్డారు.

Tags

Next Story