'ఆజాద్ కా అమృత్ మహో త్సవ్'.. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం..!

ఆజాద్ కా అమృత్ మహో త్సవ్.. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తాం..!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం పాత్ర ప్రత్యేకమైనదని కేసీఆర్ తెలిపారు. మార్చి 12 నుంచి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖ, సాంస్క్రతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమీషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్క్రతిక శాఖ డైరక్టర్ లు ఉంటారన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతతో పాటు విధి విధానాల లక్ష్యాలను ప్రధాని వివరించారు. అన్ని రాష్ట్రాలు 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని మోదీ కోరారు.

ప్రధానితో వీడియో కాన్పరెన్స్ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సాంస్క్రతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి12న, హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసిఆర్., వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ లు హాజరవుతారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. 75వ స్వాతంత్ర్యోత్సవ ఉత్సవాలకు గుర్తుగా సంజీవయ్య పార్క్ లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story