Telangana : అందుకు కేంద్రాన్ని రూ.1000 కోట్లు సాయం కోరిన తెలంగాణ ప్రభుత్వం..

Telangana : వరదల కారణంగా రాష్ట్రంలో తలెత్తిన నష్టంపై కేంద్రానికి రిపోర్టు సమర్పించింది తెలంగాణ సర్కార్. వివిధ శాఖలో పరిధిలో జరిగిన నష్టాన్ని రిపోర్టులో పొందుపరిచింది.
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని జిల్లాల్లోని ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు అధికంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వరదల వల్ల జరిగిన నష్టంపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ప్రాథమిక నివేదిక రూపొందించి కేంద్రానికి అందించింది.
రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా దాదాపు 14 వందల కోట్ల నష్టం జరిగినట్లు నివేదికలో వెల్లడించింది. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు విడుదలచేయాలని కేంద్రాన్ని కోరింది.
వర్షాలు, వరదల కారణంగా కాజ్వేలు, రోడ్లు కొట్టుకుపోవడంతో రోడ్లు భవనాల శాఖకు 498 కోట్లు, నీటి పారుదల శాఖకు 33 కోట్లు నష్టం వచ్చిందని రాష్ట్రప్రభుత్వం నివేదికలో పొందుపరిచింది. వరదల వల్ల పంచాయతీ రాజ్ శాఖకు 449 కోట్లు. విద్యుత్ శాఖకు 7 కోట్లు, పురపాలక శాఖలో 379 కోట్లు, ప్రజలను తరలించడానికి 25 కోట్లు ఖర్చు చేసినట్లు రిపోర్టులో తెలిపింది.
ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు, పరిస్థితిపై ఆరా తీశారు. భద్రాచలం, ఏటూరు నాగారంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. భద్రాచలం దగ్గర ఏరియల్ రివ్యూ చేశారు. భద్రాచలంలో వరద బాధితులకు పది వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ముంపు సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com