Telangana High Court : తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం..!
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ విషయంలో ప్రభుత్వ తీరును.. హైకోర్టు తప్పుపట్టింది. ఆసుపత్రి నిర్మాణంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నిర్మాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏజీ ప్రసాద్ తెలిపారు. అయితే ఏజీ సమాధానంపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ఇంకా ఎన్ని రోజులు కావాలని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు దురదృష్టకరమని మండిపడింది. ఆసుపత్రి సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ ఎందుకు సమర్పించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణలో బిజిగా ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరగా.. ఆరు వారాల్లో బ్లూ ప్రింట్ తో సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com