హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దు : హైకోర్టు

Telangana High court : తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది. పాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని, లేదంటే హుస్సేన్ సాగర్లోనే ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి, వాటిలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
దూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తీసుకొచ్చే విగ్రహాలను ఒకే రోజు హుస్సేన్ సాగర్కు రాకుండా ప్రణాళికలు చేపట్టాలని చెప్పింది ధర్మాసనం. చిన్న విగ్రహాలు ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని సూచించింది. ఇక నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని, రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని చెప్పిన హైకోర్టు.. మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని, మండపం నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాత్రి పది తరువాత మైకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని చెప్పింది హైకోర్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com