వృద్ధ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే... జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు ; హైకోర్టు

ఫించను డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న గంగాధర్ తిలక్ దంపతులపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు హైకోర్టు స్పందించింది. వృద్ధ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే... జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం...GHMCకి సిగ్గుచేటని వ్యాఖ్యానించింది..GHMC అధికారుల వేతనాలను...తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. పనిచేయనప్పుడు బల్దియాకు బడ్జెట్ తగ్గించడం మంచిందని సూచించింది.
ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా అని GHMCని నిలదీసింది హైకోర్టు. అయితే నగరంలో అద్భుతమైన రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు GHMC తరఫు న్యాయవాది. దీంతో రోడ్లపై గుంతలే లేవా.. న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా అని ప్రశ్నించింది హైకోర్టు. వర్షాకాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మత్తు కోసం....ప్రణాళికలేంటని GHMCని ప్రశ్నించింది న్యాయస్థానం. జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
2010 నుంచి గంగాధర్ తిలక్, వెంకటేశ్వరీ దంపతులు నగరంలోని రోడ్లపై పడిన గుంతలు పూడుస్తున్నారు. ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకొని వెళ్లి గుంతలను పూడుస్తున్నారు. తమ కారుకు కూడాపాత్హోల్ అంబులెన్స్ అని పేరు పెట్టారు. గుంత కనిపిస్తే కారు ఆపి దానిని పూడ్చేస్తారు. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల 30 గుంతలను తిలక్ దంపతులు పూడ్చారు. ఒక్కోగుంత పూడ్చడానికి దాదాపు 2వేల రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. తన ఫించన్ డబ్బులతోనే తిలక్ స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారు.
తిలక్ చేస్తున్న సామాజికి సేవను మెచ్చి బిగ్బి అమితాబ్ ఓ కారును కూడా బహుమతిగా ఇచ్చారు. వృద్ధ దంపతులు చేస్తున్న సామాజిక సేవలపై టీవీ5 కథనాలు ప్రసారం చేసింది...ఇప్పుడు ఈ అంశంపైనే విచారణ చేపట్టిన.. హైకోర్టు జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com