TG: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

TG: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
X
అధికారులపై దాడి కేసులో అనూహ్య పరిణామం.. రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు...

తెలంగాణలో లగచర్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్ సహా పోలీస్ ఉన్నతాధికారులపై దాడి ఘటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. కేటీఆర్ ఆదేశానుసారం పట్నం నరేందర్ రెడ్డి అధికారులపై దాడికి ప్లాన్ చేశారన్నది తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫార్మా భూములకు సంబంధించి అధికారులు పెట్టనున్న గ్రామసభలో గొడవ చేయాలని బోగమాని సురేశ్ కు పట్నం నరేందర్ రెడ్డి బాధ్యతలను అప్పగించారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని పేర్కొన్నారు. అవసరమైతే అధికారులను చంపేందుకు సైతం వెనుకాడకూడదని నిందితులకు ఆదేశాలు వెళ్లినట్లు పోలీసులు సంచలన విషయాల్ని రిపోర్టులో వెల్లడించారు. దాడికి సంబంధించి మనుషులను అరేంజ్ చేయించటం, కర్రలు, కారంపొడి, రాళ్లు ఇలా ప్రతీ ఒక్కటి అటు ఆర్థికంగా, ఇటు మనుషులను అరేంజ్ చేసేందుకు సురేశ్ కు పట్నం నరేందర్ రెడ్డి సహకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు.

కీలక సూత్రధారి పట్నమే

హకీంపేట్, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్ల తండా, లగచర్ల గ్రామాల రైతులను తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా న‌రేందర్‌రెడ్డి రెచ్చ‌గొట్టినట్లు పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వ అధికారులను చంపేందుకు కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని తేలిందని పోలీసులు రాశారు. తద్వారా ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనేది అసలు కుట్ర అని పోలీసులు వెల్లడించారు. ఇందుకు పార్టీకి సంబంధించిన కీలక నేత నుంచి ఆదేశాలు సహాయ సహకారాలు ఉంటాయని.. రేపు ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనే చూసుకుంటారని హామీ కూడా వచ్చినట్లు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ కీలక నేత కేటీఆరే నంటూ పోలీసులు పేరును సైతం రాశారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ డీటీసీ కి తరలించిన తర్వాత చేసిన విచారణలో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపారు.

ఏ1గా పట్నం

మరోవైపు ఏ2గా ఉన్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్లో ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. లగచర్లలో జరిగిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.

దాడికి ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎంతటి వారైనా అరెస్టు కాక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై బీఆర్‌ఎ్‌సకు చెందిన ఓ రౌడీషీటర్‌ ఆధ్వర్యంలో దాడులు జరిగాయని, అధికారం కోల్పోవడంతో ఒత్తిడిలో వారు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. . దాడిని ప్రోత్సహించిన బీఆర్‌ఎస్‌ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెల్లడించారు.

Tags

Next Story