TELANGANA: సైబరాసురులకు చెక్ పెడుతున్న తెలంగాణ పోలీస్

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన విస్తృత ఆపరేషన్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. "ఆపరేషన్ ఆక్టోపస్" పేరుతో నిర్వహించిన ఈ సమన్వయ దాడుల్లో ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు జరిపి అతిపెద్ద సైబర్ నేర ముఠాను పోలీసులు ఛేదించారు. వంద మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఎత్తున నగదు, బ్యాంకు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో "డిజిటల్ అరెస్ట్" పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు దోచుకునే మోసాలు పెరిగాయి. అలాగే ప్రముఖుల, సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అధికమయ్యాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలను ఉపయోగించి నకిలీ ప్రకటనలు, మోసపూరిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న ముఠాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేర గుంపులు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సమన్వయంతో నెట్వర్క్లను నడుపుతున్నట్లు తేలింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యాణా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్లు క్రియాశీలంగా ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం 16 రాష్ట్రాల్లో 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంగా దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 104 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, బ్యాంకు ఖాతాలను సరఫరా చేసే మధ్యవర్తులు, అకౌంట్ సప్లయర్లు, సైబర్ మోసగాళ్లు మాత్రమే కాకుండా కొంతమంది బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సైబర్ నేరాలకు బ్యాంకు స్థాయిలో సహకారం అందించిన వారిని కూడా విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ ముఠాలు 1055 సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. బాధితుల నుంచి కోట్ల రూపాయల వరకు మోసపూరితంగా వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. దాడుల సందర్భంగా 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్ పాస్బుక్స్, 234 క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు, 56 కార్పొరేట్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.36 లక్షల నగదును సీజ్ చేశారు. "డిజిటల్ అరెస్ట్" పేరిట ఫోన్ కాల్స్ చేసి తాము కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేసే మోసాలు ఈ ముఠాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రముఖుల వీడియోలను మోర్ఫింగ్ చేసి పెట్టుబడుల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
