బెంబేలెత్తిస్తున్న భానుడు.. 23జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్

రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటికి రావడానికి ప్రజలు భయపడిపోతున్నారు.ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరిగాయి. దీంతో ఉక్కపోత మరింత ఎక్కువైంది. గురువారం 23 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మధ్యభారతం నుంచి దక్షిణ భారతం వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. పశ్చిమ దిశగా వస్తున్న పొడిగాలులతో వాతావరణం వేడెక్కింది.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.8 డిగ్రీలు, అత్యల్పం జీహెచ్ఎంసీలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్లో 40.4డిగ్రీలు, రామగుండం 40.2, మెదక్ 38.8, హనుమకొండ 38, నల్లగొండ 40.1, భద్రాచలం 40.5, ఖమ్మం 39.6, మహబూబ్నగర్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com