Telngana: విశాఖకు చేరిన ఇల్లందు రాజకీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో వివాదం ముదురిపాకాన పడింది. మున్సిపల్ ఛైర్మన్ వర్సెస్ కౌన్సిలర్స్గా మారిన ఈ వ్యవహారంలో ఇప్పుడు క్యాంపు రాజకీయం మరింత జోరందుకుంది. చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా అసమ్మతి కౌన్సిలర్లు కొత్తగూడెం కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. తాజాగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన కౌన్సిలర్లు విశాఖలో క్యాంపు పెట్టారు. దీంతో ఇల్లందు రాజకీయం ఇప్పుడు విశాఖ చేరినట్లయింది.
గత కొంతకాలంగా ఇల్లందు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, చైర్మన్కు మధ్య వివాదం నడుస్తోంది. చైర్మన్ తమ వార్డుల్లో అభివృద్ధి చేయకుండా, మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్పై తిరుగుబావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే హరి ప్రియ జోక్యం చేసుకోవడవంతో సమస్య కొంత వరకు చల్లారినా మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా పేరున్న ఇల్లందులో ఈ రాజకీయ సునామీ ఎటువైపు దారితీస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
వెంకటేశ్వరరావు చైర్మన్గా ఎన్నికైన నాటి నుంచే కౌన్సిలర్లతో సఖ్యత లేదనే మాట వినిపిస్తోంది. ఎన్నోసార్లు జిల్లా, రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు.. చైర్మన్పై ఎక్కడ వ్యతిరేకత ఉందో ఆ మూలాలను తెలుసుకోలేక సమస్య మరింత జటిలం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ వివాదం చైర్మన్ను మార్చేంత వరకు సమసిపోదనే వాదన కూడా వస్తోంది. తమపై ఒత్తిడి తీసుకొస్తే ఆత్మహత్యకు కూడా సిద్ధమేనని కౌన్సిలర్లు బెదిరింపులకు దిగుతుండటంతో సమస్యకు ఫుల్ స్టాప్ ఎలా పెడతారనే ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com