Telangana: తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. చలికి వణికిపోతున్న ప్రజలు..

Telangana: తెలంగాణలో చలి వణికిస్తోంది. హిమాలయాల నుఎంచి వస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. పొద్దున పదింటి వరకు చంపేస్తున్న చలి.. సాయంత్రం ఐదారు కాగానే మళ్లీ వణికిస్తోంది. దీంతో వర్షాలప్పుడు హెచ్చరికలు ఇచ్చినట్టే.. తెలంగాణలోని 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది వాతావరణ కేంద్రం.
మరో మూడు రోజుల పాటు చలి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితులు ఫిబ్రవరి వరకు మూడు విడతలుగా రావొచ్చని.. అప్పుడు గడ్డకట్టించే చలి వణికిస్తుదందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న అతిశీతల గాలులతో హిమాలయా పర్వత ప్రాంతాల్లో వెస్ట్రన్ డిస్టమెన్స్ ఏర్పడింది.
దీంతో ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దక్షిణ భారతదేశంలోకి శీతల గాలులు ప్రవేశిస్తున్నాయి. దీనికారణంగానే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్లో చలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రాజేంద్రనగర్లో 9.9 డిగ్రీలు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లిలో 11 డిగ్రీలు, సికింద్రాబాద్లో 12, హయత్నగర్లో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగత్రలు నమోదయ్యాయి.
తెలంగాణలోని 10 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్, అల్గోల్, సత్వార్, నల్లవెల్లి ప్రాంతాల్లో 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8-9 డిగ్రీల మధ్యలో రికార్డ్ అయ్యాయి.
ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో సగటున 8 నుంచి 9 డిగ్రీలు, మధ్య తెలంగాణలో 10 నుంచి 11 డిగ్రీలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య సగటుతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com