TG: తెలంగాణ మహిళ కమిషన్ ఛైర్మన్గా గద్వాల విజయలక్ష్మీ

తెలంగాణలో మహిళల హక్కుల పరిరక్షణకు కీలకంగా భావించే మహిళా కమిషన్కు ప్రభుత్వం కొత్త బృందాన్ని నియమించింది. కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ సభ్యులుగా చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరా, అలాగే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మలకు అవకాశం కల్పించింది. కొత్తగా నియమితులైన చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద బాధ్యతలు నిర్వహించగా, ఆమెకు ముందు సునీత లక్ష్మారెడ్డి ఆ పదవిలో ఉన్నారు. మహిళల సమస్యలపై స్పందిస్తూ, వారికి న్యాయం జరిగేలా చూడటంలో మహిళా కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అన్యాయాలు, వేధింపుల అంశాలను పరిశీలించడం, ఫిర్యాదులపై విచారణ చేపట్టడం, అవసరమైన చట్టపరమైన సలహాలు అందించడం కమిషన్ ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి. అదే సమయంలో మహిళా సాధికారత, లింగ సమానత్వం వంటి అంశాలపై అవగాహన పెంపొందించడంలో కూడా కమిషన్ చురుకుగా పనిచేస్తోంది. కొత్త కమిషన్ నియామకాలతో మహిళా సమస్యల పరిష్కారంలో మరింత వేగం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
