TG: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని ప్రభుత్వ జీవోలో స్పష్టం చేసింది.
జీవో విడుదల
గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గ్రామ పంచాయతీ వార్డు స్థానాలకు 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని, సర్పంచ్ స్థానాలకు 2011సెన్సస్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, 2024సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవోలో ఆదేశించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ రాజ్ శాఖ నుంచి గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ తో కూడిన జీవోను విడుదల చేసింది. రోటేషన్ల విధానంలో రిజర్వేషన్లు అమలు కానుండటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారబోతున్నాయి. వార్డు స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేయాలని నిర్ధేశించింది.
రొటేషన్ పద్ధతిలో....
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ రిజర్వేషన్లను రొటేషన్ పద్దతిలో అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. రిజర్వేషన్ కేటాయింపునకు సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే ఆధారంగా ఉండాలని, సర్పంచ్ రిజర్వేషన్కు 2011 జనగణనతోపాటు SEEPC డేటా వినియోగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. 100శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని పేర్కొంది. రిజర్వేషన్లు కేటాయింపు చేయాలని పేర్కొంది. మునుపటి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదని, 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చునని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. వార్డు రిజర్వేషన్ల నిర్ణయం ఎంపీడీవో, సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం ఆర్డీవో ఆధ్వర్యంలో జరగాలని పేర్కొంది. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి, తరువాత ఎస్సీ , బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు చేయాలని పేర్కొంది. మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేయాలని, మొదట మహిళలు, ఆ తరువాత లాటరీ పద్దతి ద్వారా కేటాయించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

