TG: తెలంగాణలో ఒంటిపూట బడులపై ఆదేశాలు

TG: తెలంగాణలో ఒంటిపూట బడులపై ఆదేశాలు
X

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మార్చి 16 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సమయ పట్టిక ప్రకారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాంటి పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.ఇక రంజాన్ సందర్భంగా కూడా పాఠశాల సమయాల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలల్లో ప్రత్యేక టైమ్‌టేబుల్ అమలు చేయాలని ఆదేశించారు. ఆ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైతే వారానికి ఒక రోజు అదనంగా తరగతులు నిర్వహించవచ్చని కూడా విద్యాశాఖ సూచించింది. విద్యార్థుల ఆరోగ్యం, పరీక్షల నిర్వహణ, మతపరమైన సందర్భాలను సమన్వయం చేస్తూ ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story