Sai Pallavi: సాయిపల్లవికి హైకోర్టులో చుక్కెదురు.. దాఖలు చేసిన పిటిషన్ రద్దు..
Sai Pallavi: సినీనటి సాయి పల్లవి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని హైదరాబాద్ సుల్తాన్బజార్ పోలీసులకు భజరంగ్దళ్ నాయకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. భజరంగ్దళ్ నాయకుల ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.. సాయిపల్లవికి గతనెల 21న నోటీసులిచ్చారు. దీంతో నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే ఆమె అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది.
తాను ప్రధాన పాత్ర పోషించిన 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాయి పల్లవి తన నేపథ్యం గురించి చెబుతూ.. లెఫ్ట్వింగ్, రైట్వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్గా ఉంటానన్నారు. ఈ నేపథ్యంలోనే 'కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి మాట్లాడారు. ''90ల్లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో ఆ చిత్రంలో చూపించారు కదా..! కొవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్ ఓ ముస్లిం. కొంతమంది అతడిని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు'' అంటూ సాయిపల్లవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఐతే సాయి పల్లవి వ్యాఖ్యలపై భజ్రంగ్దళ్ కార్యకర్తలతో పాటు బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే తనకిచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్ను కోర్టు కొట్టేసింది. సాయి పల్లవి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా..?. పోలీసులు నెక్స్ట్ స్టేప్ ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com