Online Classes: తెలంగాణలో విద్యార్థుల ఆన్లైన్ క్లాసులపై కన్ఫ్యూజన్..

Online Classes: ఆన్లైన్ క్లాసులు ఉంటాయా ఉండవా? 30వ తేదీ వరకు ఇలాగే కొనసాగిస్తారా, ఆన్లైన్ క్లాసులు పెడతారా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఆన్లైన్ క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. కాని, ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే క్లారిటీ లేదు. 30వ తేదీ వరకు సెలవులు ఉన్న కారణంగా ఆన్లైన్ క్లాసులు పెడతామని జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించాయి.
ఇంటర్ బోర్డు మాత్రం సెలవుల్లో ఎలాంటి క్లాసులు ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. గవర్నమెంట్ కాలేజీలైనా, ప్రైవేట్లోనైనా సరే ఆన్లైన్ క్లాసులు లేవని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఎటొచ్చీ ప్రభుత్వ స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులు ఉంటాయా లేవా అన్నదే క్లారిటీ రావడం లేదు. ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే ఆన్లైన్ క్లాసులు నడుపుతున్నాయి. ముఖ్యంగా అప్పర్ క్లాస్ విద్యార్ధులకు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఏ తరగతుల వారికీ క్లాసులు లేవు. పైగా థర్డ్వేవ్లో కరోనా ఉధృతి ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. పరిస్థితులు అనుకూలించక సెలవుల పొడిగిస్తే పరిస్థితి ఏంటని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అసలు క్లాసులు మొదలైందే సెప్టెంబర్లో. పైగా ఈ ఏడాది సిలబస్ను 70 శాతానికి కుదించారు. అయినా సరే 40 శాతం సిలబస్ కూడా పూర్తి కాలేదు. అందులోనూ రెండేళ్లుగా పిల్లలకు క్లాసులు సరిగ్గా నడవడం లేదు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆన్లైన్ క్లాసులు పెట్టకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్ క్లాసుల సంగతి పక్కన పెడితే.. 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంపై ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లీల్లో ఉండే చిన్న స్కూళ్లలో నెలవారీగా ఫీజులు కట్టించుకుంటున్నారు. కొన్నింటిలో ఆన్లైన్ క్లాసుల వ్యవస్థే లేదు. పైగా ఈ నెలలో ఇప్పటి వరకు 5 రోజుల క్లాసులు మాత్రమే జరిగాయి. దీంతో ఈ నెల ఫీజులు వసూలు కావేమోనని చెబుతున్నారు. పైగా సెలవులు పొడిగించాల్సి వస్తే తమకు తీవ్ర నష్టం తప్పదని మొరపెట్టుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com