దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు.!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి 427 మంది దళితులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు బస్సుల్లో బయల్దేరారు. గ్రామానికి నలుగురు చొప్పున ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు, ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు చొప్పున ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారు. మరో 15 మంది రిసోర్స్ పర్సన్స్తో కలిపి మొత్తం 427 మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళిత బంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఏ విధంగా దోహదపడుతుంది? దళితుల సామాజిక, ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథక ఉద్దేశాలేంటి? ఈ పథకాన్ని దళితుల్లోకి ఎలా తీసుకపోవాలి? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా వారికి ఎలా అవగాహన కల్పించాలి? అధికారులతో సమన్వయం ఎలా చేసుకోవాలి? వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com