VANAJEEVI: అధికారిక లాంఛనాలతో నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కాసేపట్లో స్వగ్రామం రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నివాళులర్పించనున్నారు. కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఖమ్మంకు బయలుదేరారు.
జీవితమంతా వృక్షాల కోసమే
దరిపల్లి రామయ్య స్వస్థలం ఖమ్మం జిల్లా ముత్తగూడెం. 1937 జూలై ఒకటిన ఆయన జన్మించారు. అయిదో తరగతి వరకే చదువుకున్నారు. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడ ప్రారంభమైన రామయ్య వృక్ష యజ్ఞం... ఆయనకు 85 ఏళ్లు వచ్చే వరకూ నిరంతరాయంగా... కొనసాగింది. అనారోగ్యం వచ్చినా... ప్రతికూల వాతావరణం ఆటంకాలు సృష్టించినా రామయ్య వెనకడుగు వేయలేదు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వన పెంపకానికి రామయ్య అవిశ్రాంతంగా కృషి చేశారు.
విత్తనాలు పంచుతూ అవగాహన
కేవలం మెుక్కలు నాటడం మాత్రమే కాకుండా విత్తనాలు కూడా సేకరిస్తూ వాటిని అందరికీ పంచి పర్యావరణాన్ని కాపాడమని సూచించేవారు. వేసవి కాలమంతా అడవుల్లో తిరుగుతూ వివిధ రకాల విత్తనాలు సేకరించి వాటిని భద్రపరిచి ఇతరులకు అందిస్తారు. చిరు జల్లులు పడగానే మెుక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమవుతారు. బంధువుల ఇళ్లలో వేడుకలకు, వివిధ కార్యక్రమాలకు మెుక్కలను, విత్తనాలను బహుమతిగా అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు రామయ్య కృషి చేశారు.
మనవళ్లకు మొక్కల పేర్లే
రామయ్య దంపతులకు నలుగురు సంతానం. వీరి మనుమళ్లు, మనుమరాళ్లకు చందనపుష్ప, హరిత లావణ్య, కబంధ పుష్ప, వనశ్రీగా నామకరణం చేశారు. వనజీవి రామయ్యకు మొక్కలంటే అంత ప్రేమ మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com