అధికారంలోకి వస్తే రూ.500లకే సిలిండర్: రేవంత్ రెడ్డి

అధికారంలోకి వస్తే రూ.500లకే సిలిండర్: రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైందా అన్నట్లుగా నాయకులు తమ ప్రచారసభల్లో అధికారంలో ఉన్న వారిపై విమర్శలు గుప్పించడం.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర దశ, దిశను మార్చేస్తామని వాగ్ధానాలు చేయడం మామూలైపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైందా అన్నట్లుగా నాయకులు తమ ప్రచారసభల్లో అధికారంలో ఉన్న వారిపై విమర్శలు గుప్పించడం.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర దశ, దిశను మార్చేస్తామని వాగ్ధానాలు చేయడం మొదలైపోయింది. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్నెన్నో వాగ్ధానాలు చేయాలి.. అధికారంలోకి వచ్చాక అప్పుడు చూసుకుందాం అమలు చేయాలో లేదో.. అనే ధోరణి రాజకీయనాయకుల్లో కనపడడం పరిపాటి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అదే పని మీద ఉన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పీపుల్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర ఉన్న పాలమూరును అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్ వాగ్ధానం ఏమయ్యింది అని ప్రశ్నించారు. బ్రతుకు దెరువు కోసం ఉన్న ఊరిని వదిలి లక్షల మంది వలస పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ను పాలమూరు ప్రజలు అక్కున చేర్చుకుంటే ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం బర్రెలు, గొర్రెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందిందని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు 14 సీట్లు గెలిపించి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని అన్నారు. 2024 కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని రేవంత్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిన గ్రామంలో మాత్రమే బీఆర్ ఎస్ నేతలు ఓట్లు అడగాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన గ్రామంలో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story